బొల్లారం, ఏప్రిల్ 10 : జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం లో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డులవారీగా అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్తూ కొవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించేలా అవగాహన కల్పిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడాలని కమిషనర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్వో శ్రీధర్, డీఈ రఘు, పర్యావరణ అధికారి సాయికిరణ్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్, బిల్ కలెక్టర్లు ప్రదీప్ పాల్గొన్నారు.
మాస్క్ లేకపోతే జరిమానా తప్పదు
కంది, ఏప్రిల్ 10 : ఇకపై ఎవరైనా రోడ్లపై మాస్కులు లేకుండా వెళ్తే వారికి జరిమానా వేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శనివారం సంగారెడ్డిలోని పలుచోట్ల ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో మాస్కులు వేసుకోకుండా ప్రయాణిస్తు న్న వారిని గుర్తించి జరిమానా విధించారు. 10మందికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ఫైన్ వేశారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
పటాన్చెరు, ఏప్రిల్ 10: కొవిడ్ వైరస్నుంచి రక్షణకు వ్యాక్సిన్ వేయించుకోవాలని పటాన్చెరు ఎంపీడీవో బన్సీలాల్ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్ స్వప్న ఆధ్వర్యంలో ఏర్పాటైన వ్యాక్సినేషన్లో పలువురు సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ముత్తంగి సర్పంచ్ ఎం.ఉపేందర్, కర్ధనూర్ ఉప సర్పంచ్ వడ్డే కుమార్ వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్నారు. అనంతరం ఎంపీడీవో బన్సీలాల్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య తిరిగే సర్పంచ్లు, కార్యదర్శులు వాక్సిన్ తీసుకోవడంతో వారిలో ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు.