థానె: ఓ 28 ఏళ్ల మహిళకు నిమిషాల వ్యవధిలోనే 3 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసిన ఘటన థానెలోని ఆనంద్నగర్లో జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి వైద్య సిబ్బందిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. థానె మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి భార్యకే ఇలా జరగడం గమనార్హం. సదరు మహిళ జరిగిన ఘటనను తన భర్తకు చెప్పగా.. అతడు స్థానిక కార్పొరేటర్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో వెలుగులోకి రాగానే థానె మున్సిపల్ కార్పొరేషన్.. ఆ మహిళ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వైద్య బృందాన్ని ఇంటికి పంపించింది.
తన భర్త టీఎంసీలో పని చేస్తాడన్న ఉద్దేశంతో తాను ఫిర్యాదు చేయాలని అనుకోలేదని ఆ మహిళ చెప్పింది. తన భార్య తొలిసారి వ్యాక్సిన్ వేసుకుంటుండటం వల్ల ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో తనకు తెలియదని ఆమె భర్త చెప్పాడు. ఆమెకు ఆ రోజు జ్వరం వచ్చిందని, అయితే మరుసటి రోజు తగ్గిపోయి అప్పటి నుంచి బాగానే ఉన్నదని అన్నాడు. ఆమెను పరీక్షించిన వైద్య బృందం కూడా ఆ మహిళ ఆరోగ్యంగానే ఉన్నదని చెప్పింది.
అయితే ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి థానె మున్సిపల్ కమిషనర్ బిపిన్ శర్మనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన తప్పిదం ఎలా జరుగుతుంది? ఒకే మహిళ మూడుసార్లు వ్యాక్సిన్ తీసుకుంటుంటే అక్కడి సిబ్బంది ఏం చేస్తున్నారు? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేశామని బీజేపీ ఎమ్మెల్యే నిరంజన్ దావ్ఖరె అన్నారు. థానె మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.