శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగుతున్నది. ఇటీవల చాలా మార్పులు కనిపించాయని, హిమపాతం వేగంగా తగ్గిపోతున్నదని సోన్మార్గ్లోని టూరిస్ట్ గైడ్ బిలాల్ అహ్మద్ తెలిపారు. 20 ఏండ్ల కింద తాజివాస్ పర్వతాలపై మంచు పలకలు చాలా మేరకు విస్తరించి ఉండేవని, సోన్మార్గ్ నుంచి కాలి నడకతోనే ఆ మంచు కొండల అందాలు పర్యాటకులకు కనువిందు చేసేవని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఈ మంచు శిఖరాన్ని చూసేందుకు కొన్ని కిలోమీటర్ల వరకు పర్యాటకులు నడవాల్సి వస్తున్నదని ఆ గైడ్ తెలిపారు.
కాగా, తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగడానికి గ్లోబల్ వార్మింగ్ ముఖ్య కారణమని పర్యావరణ శాస్త్ర విద్యార్థి నదియా రషీద్ తెలిపారు. అక్టోబర్ నెలలో కూడా జూలై మాదిరిగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగడమే దీనికి కారణమని అన్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్, లడఖ్లోని హిమానీనదాలు గణనీయమైన స్థాయిలో కరుగుతున్నాయని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా తొలిసారి నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 2000-12 మధ్య హిమాలయ పర్వత ప్రాంతంలోని 1,200కుపైగా గ్లేసియర్లు ప్రతి ఏటా 35 సెంటీమీటర్ల చొప్పున తగ్గుతున్నాయి.
ప్రధానంగా పిర్ పంజల్ రేంజ్లోని మంచు పర్వతాలు గరిష్ఠ స్థాయిలో ఏటా ఒక మీటరుకుపైగా కరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అయితే కరకోరం పర్వత శ్రేణిలో మాత్రం మంచు కరుగుదల చాలా నెమ్మిదిగా ఉన్నదని, ఏటా పది సెంటీమీటర్ల మేర కరుగుతున్నదని గుర్తించినట్లు శ్రీనగర్లోని కశ్మీర్ విశ్వవిద్యాలయంలో పరిశోధన డీన్ అయిన ప్రొఫెసర్ షకిల్ అహ్మద్ రోమ్షూ తెలిపారు.