కోల్కతా: స్వదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ నిర్వహించడం వల్లనే కరోనా కేసులు ఎక్కువయ్యాయని భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ బయో బబుల్తో పోల్చుకుంటే ఈ సారి బుడగ అంత పటిష్టంగా లేదనే అర్థం వచ్చే విధంగా సాహా మాట్లాడాడు. లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన సాహా.. మహమ్మారి బారినపడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం సిద్ధమవుతున్న సాహా శనివారం బయోబబుల్పై పెదవి విప్పాడు. ‘యూఏఈలో జరిగిన గత ఐపీఎల్ సీజన్ కోసం మేము ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కనీసం ఒక్క వ్యక్తి కూడా కనబడేవాడు కాదు. గ్రౌండ్స్టాఫ్ను కూడా అనుమతించలేదు. కానీ ఈసారి మేం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అభిమానులు గోడలపై నుంచి చూసేవారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పాలనుకోవడం లేదు. యూఏఈలో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సీజన్ పూర్తయ్యేది’ అని సాహా చెప్పాడు.
బయోబబుల్లోకి వైరస్ ఎలా ప్రవేశించిందో ఎవరికీ అర్థం కావడం లేదని సాహా పేర్కొన్నాడు. మహమ్మారి విజృంభణతో ఈనెల 4న ఐపీఎల్ తాజా సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడగా.. బయోబబుల్ ఏర్పాటుపై ఓ భారత ఆటగాడు స్పందించడం ఇదే తొలిసారి. కొవిడ్-19 పాజిటివ్ రావడంతో ఢిల్లీలోనే స్వీయనిర్బంధంలో ఉన్న సాహా ఇటీవల కోల్కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు. ‘ప్రస్తుతం నా ఆరోగ్యం మెరుగ్గా ఉంది. శరీరంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హోటల్ గదికే పరిమితమైన సమయంలో సినిమాలతో కాలక్షేపం చేశా. కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది’ అని సాహా అన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో వికెట్ కీపర్గా రిషబ్ పంత్కే తన ఓటన్న సాహా.. ఎవరో ఏదో అంటున్నారని తన బ్యాటింగ్ శైలిని మార్చుకోనని స్పష్టం చేశాడు. ‘మన ప్రదర్శన బాగా లేనప్పుడు విమర్శలు రావడం సహజమే. అయినా ఎవరో ఏదో అన్నారని నా బ్యాటింగ్ తీరు మార్చుకోను. మరింత కఠోరశ్రమతో ఆటపై దృష్టి కేంద్రీకరిస్తా. వచ్చిన అవకాశాన్ని పంత్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. నా వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అన్నిటి కంటే పెద్దది. ఇంగ్లండ్ పిచ్లు పేసర్లకు సహకరిస్తాయి. అలాంటి చోట ఆడటం బ్యాట్స్మన్కు కాస్త కష్టమే’ అని అన్నాడు.