పై ఫొటోలో కనిపిస్తున్నది మాదాపూర్ నుంచి కూకట్ పల్లి వెళ్లే దారిలో హైటెక్సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో 66.59 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ వంతెనను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి సోమవారం ప్రారంభించారు. దీంతో రోజూ ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు మహా ఊరట లభించినట్లయింది. ఇలాంటి అభివృద్ధి పనులు ప్రస్తుతం నగరమంతటా జరుగుతున్నాయి. 2014 కంటే ముందు ఏలిన ప్రభుత్వాలు హైదరాబాద్ నగ రాన్ని కాసులు కురిపించే బంగారు బాతుగా భావించి పిండుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత భాగ్య నగరం రూపురేఖల్లో గణనీయమైన మార్పు కనపడుతున్నది. కరెంటు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. ఎస్సార్డీపీ పనులతో గంటల తరబడి ట్రాఫిక్ జాంలు లేకుండా పోయాయి. ఆనందంగా ఆహ్లాదంగా జీవనం సాగించేందుకు అనువుగా ఈ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఆరేండ్లలో రూ.67,035.16 కోట్లు వెచ్చించింది. నగరాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ప్రజలకిచ్చిన మాటను చేతల్లో చేసి చూపుతున్నది.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలో నాలుగు చోట్ల దాదాపు రూ. 71.49కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో రూ. 3500 కోట్ల వ్యయంతో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలను పరిశీలిస్తే…
హైదరాబాద్ మహానగరాన్ని సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హైటెక్సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.66.59 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని రికార్డు సమయంలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20 .60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్యూబీ ప్రారంభంతో తీవ్రమైన ట్రాఫిక్ కలిగిన హైటెక్ సిటీ- ఎం.ఎం.టీ.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ఏవిధమైన అవాంతరాలు లేకుండా ట్రాఫిక్ వెళ్లే అవకాశం ఏర్పడింది. స్థానికులతో పాటు ఐటీ ఉద్యోగులకు మహా ఉపశమనం లభించనుంది.
మూసాపేట్ సర్కిల్ 23లోని వార్డు నంబరు 115లోని అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్ యార్డు వరకు రూ. 99లక్షలతో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా సివిల్ కోర్డు ఏర్పాటు నేపథ్యంలో 800 మీటర్ల మేర పొడవున ఈ రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు స్థానంలో ఆధునాతన ట్రాన్స్ఫర్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు.
కేపీహెచ్బీ కాలనీ నాల్గో ఫేజ్లో రూ.3.50 కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. 4000 చదరపు గజాల స్థలంలో 6195 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ను నిర్మించారు. 2016 సంవత్సరంలో ఈ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించగా, సోమవారం అందుబాటులోకి వచ్చింది. చుట్టూ పరిసర ప్రాంతాల వాసులకు శుభకార్యాలు, పలు సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు , బహుళ ప్రయోజనాలకు వీలుగా విశాలంగా, సకల సౌకర్యాలతో ఈ హాల్ నిర్మాణం జరిగింది.
మూసాపేట సర్కిల్ -23, వార్డు నంబరు 114లోని కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్ జీహెచ్ఎంసీ డాగ్ షెడ్ పక్కన రూ. 4 లక్షలతో నిర్మించిన బ్రాహ్మణ సంఘాల అపరకర్మల భవ నం వినియోగంలోకి వచ్చింది. 500చదరపు గజాల విస్తీర్ణం లో 568.33 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన నిర్మా ణం చేపట్టారు. ఈ భవనంలో బ్రాహ్మణులు తమ సంప్రదాయ పద్ధ్దతిలో అంతిమక్రియలు, అనంతరం జరిగే పూజ కార్యక్రమాలకు వీలుగా ఈ భవన నిర్మాణం జరిగింది.