గ్రేటర్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. విద్యుత్ వినియోగం కూడా పెరిగిపోతున్నది. విద్యుత్ మీటర్లు స్పీడు పెంచాయి. గిర్రున తిరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ సారి విద్యుత్ వినియోగం అధిక మొత్తంలో పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్కు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. మార్చి నెల ముగుస్తుండటంతో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉక్కపోత పెరగడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేనిదే ఇల్లు, కార్యాలయాల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో గృహ విద్యుత్ వినియోగంతో పాటు వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. మార్చి నెలాఖరులో 57మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు నమోదైందని అధికారులు తెలిపారు.
జనవరి నెలలో రోజు వారి విద్యుత్ వినియోగం అత్యల్పంగా 37మిలియన్ యూనిట్లు నమోదు కాగా, అత్యధికంగా 45 మిలియన్ యూనిట్లుగా నమోదైందని, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 47యూనిట్ల వరకు నమోదైందని పేర్కొన్నారు. ఇక మార్చిలో అత్యధికంగా 57మిలియన్ యూనిట్లుగా నమోదైందని తెలిపారు. ఈ డిమాండ్ వచ్చే ఏప్రిల్, మే నెలలో మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో మొత్తం ఫీక్ అవర్ డిమాండ్ 7248 మెగా వాట్ల వరకు ఉండగా, అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లలో 2300మెగావాట్ల నుంచి 2600 మెగావాట్ల వరకు విద్యుత్ ఫీక్ అవర్ డిమాండ్గా ఉంది.
కరోనా వైరస్ నేపథ్యంలో గతేడాది మార్చి 22నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా ఉండాల్సిన విద్యుత్ వినియోగం లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా తగ్గిపోయింది. 2019 మే నెలలో విద్యుత్ వినియోగం 73మిలియన్ యూనిట్లు నమోదు కాగా, 2020 మే నెలలో 69మిలియన్ యూనిట్లుగా నమోదైంది. తాజాగా 2021 వేసవిలో రోజువారి విద్యుత్ డిమాండ్ 78 మిలియన్ యూనిట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీ కారిడార్లోని ఎంఎన్సీ ఐటీ కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చారు.
అయితే మిగతా కంపెనీలు మాత్రం కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యాలయాలను నిర్వహిస్తున్నాయి. దీనికి తోడు కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో నివాసాలు పెరుగుతుండటంతో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా కోర్ సిటీతో పోల్చితే శివారు ప్రాంతాల్లోనే కొత్త కనెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయని, దానికి తగ్గట్లుగా విద్యుత్ సరఫరా నెట్వర్క్ను విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతున్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు, ముఖ్యంగా సినిమా థియేటర్లు ఈ వేసవిలో పూరి స్థాయి సీట్ల సామర్థ్యంలో పనిచేయనున్నాయి. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందని, అది 78 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.