పంట పొలాల్లోకి చేరుతున్న నీరు
దుక్కులు దున్నుతున్న రైతులు
దామెర, జూన్ 9: మండలంలోని వివిధ గ్రామాల్లో బుదవారం తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది. ల్యాదెళ్ల, దామెర, పులుకుర్తి, ఊరుగొండ, ఒగ్లాపురం తదితర గ్రామాల్లో రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పంటపొలాల్లో నీరు భారీగా నిలిచింది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటపొలాలను దున్ని విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు.
నడికూడలో..
నడికూడ : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉదయం రెండు గంటల పాటు జోరుగా వానపడింది. జూన్ మొదట్లోనే ఇంతలా వర్షాలుంటే మున్ముందు భారీగా ఉంటాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా ఉంటే ఉపాధి హామీ పథకంలో చెరువుల్లో పూడిక తీయడం వల్ల నీటి నిల్వ పెరుగుతుందని రైతులు భావిస్తున్నారు.
నర్సంపేట రూరల్లో..
నర్సంపేట : మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రెండు నెలలుగా సూర్యుడి ప్రతాపానికి గ్రామాల్లోని ప్రజలు ఎండలతో ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. పొలాలు, చెలకల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రైతులు పంట పొలాలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వర్షపు నీటితో గ్రామాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈ సారి కాలం బాగుటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు.
సంగెంలో..
సంగెం : మండలంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాన కురిసింది. తొలకరి జల్లులతో రైతన్నలు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఈ నేపథ్యంలో వానకాలం ప్రారంభం కావడంతో రైతులు దుక్కులను పొదును చేసుకునే పనుల్లో ఉన్నారు. కొంతమంది ఇప్పటికే చెలుకల్లో అచ్చు కొట్టి విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యారు. మరి కొందరు నార్లు పోసేందుకు యత్నిస్తున్నారు.
ఇల్లంద మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం
వర్ధన్నపేట, జూన్ 9 : మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్యార్డులోని ధాన్యం బుధవారం వర్షానికి మరోసారి తడిసింది. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తరలించారు. తూకం వేసి మిల్లులకు తరలించడంలో జాప్యం ఏర్పడడంతో వర్షానికి తడిసిందని రైతులు తెలిపారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా భారీ వర్షం మూలంగా కుప్పలకిందికి నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.