న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ) దేశంలోని పలు నగరాల్లో తనకు గల ఇండ్ల ఫ్లాట్లు, ఆస్తులను విక్రయించాలని ప్రణాళిక రూపొందించింది. దీనిద్వారా రూ.250-300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే, ఈ ఆస్తులు అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఎయిర్ ఇండియా ఆస్తులు ఉన్నాయి.
వివిధ నగరాల్లోని ఎయిర్ ఇండియా (ఏఐ) తన ఆస్తులను విక్రయించడానికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ ఆస్తుల విక్రయాలకు బిడ్లను ఆహ్వానించిందీ నోటీసు.
ఎయిర్ ఇండియాకు వాణిజ్య, నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ ఆస్తుల విక్రయానికి ఎంఎస్టీసీ అనే సంస్థను నియమించుకున్నది. ఈ-వేలం ద్వారా ఈ ఆస్తుల విక్రయ ప్రక్రియ కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఐదు ఫ్లాట్లు, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఒక రెసిడెన్షియల్ ప్లాట్, ఫ్లాట్లు, బెంగళూరులో నివాస ఇల్లు, కోల్కతాలో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ విక్రయించనున్నది ఎయిర్ ఇండియా.
అలాగే ఔరంగాబాద్లో ఒక బుకింగ్ ఆఫీసు, స్టాఫ్ క్వార్టర్స్, నాసిక్లో ఆరు ఫ్లాట్లు, నాగ్పూర్లో బుకింగ్ ఆఫీసు, భుజ్లో ఎయిర్ లైన్స్ హౌస్, ఒక రెసిడెన్షియల్ ప్లాట్, తిరువనంతపురంలో ఒక రెసిడెన్షియల్ ప్లాట్, మంగళూరులో రెండు ఫ్లాట్లు ఉన్నాయి.
ఢిల్లీలోని ఏషియాన్ గేమ్స్ విలేజ్ కాంప్లెక్స్లో, ముంబైలోని బంద్రాలో ఆస్తులు ఉన్నాయి. బంద్రాలోని పాలి హిల్లో 14 ఫ్లాట్లు ఉన్నాయి. దిలీప్ కుమార్, సునీల్ దత్ వంటి బాలీవుడ్ నటులకు పాలి హిల్లో ఇల్లు ఉన్నాయి.
పాలి హిల్లోని ప్రతి ఫ్లాట్ విలువ రూ.10 నుంచి 25 కోట్లు పలుకుతుంది. శాంతాక్రాజ్లో కూడా ఫ్లాట్లు ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఉన్నాయి. ఎయిర్ ఇండియా నోటీసు ప్రకారం వచ్చే నెల 8న బిడ్లు ఓపెన్ చేస్తారు. 9న ముగిస్తారు.
ఎయిర్ ఇండియా టైం ప్రకారం ఆస్తుల విక్రయానికి చర్యలు చేపట్టింది. భారీ అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా నష్టాలను ఎదుర్కొంటున్నది. పలు దఫాలు ఈ ఆస్తులను విక్రయించడానికి కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.