న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన చలి, పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా రోడ్లపై వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఢిల్లీలో 7.5 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొన్నది. ఉదయం 8.30 గంటలకు గరిష్ట ఉష్ణోగ్రత 22.2 డిగ్రీల సెల్సియస్గా నమోదవడంతో, కేంద్రపాలిత ప్రాంతం తెల్లవారుజామున పొగమంచుతో ప్రధానంగా ఆకాశం నిర్మలంగా ఉన్నది. మంగళవారం కూడా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కానున్నది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్తోపాటు పలు వాయవ్య రాష్ట్రాల్లో ఫిబ్రవరి 2-4 తేదీల మధ్య వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది.
తెలంగాణపై చలిపులి పంజా విసురుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి టీ లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బేలాలో 7.8, చెప్రాలలో 8, నిర్మల్ జిల్లా తానూర్లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. కాగా, పెంబిలో 8.4, తిర్యానిలో 8.4 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం బయటకు రావడం లేదు. మంచిర్యాల జిల్లా ర్యాలీలో 8.2 డిగ్రీలు, కవ్వాల్ టైగర్ జోన్లో 8.3 డిగ్రీలు, కుబ్రం భీం జిల్లా వాంకిడిలో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆంధ్రాలోనూ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విశాఖ ఏజెన్సీ చింతపల్లి 3 డిగ్రీలతో వణికిపోతున్నది. జనం చలికి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అరకులో 8 డిగ్రీలు, పాడేరులో 9 డిగ్రీలు, మినుములూరులో 7డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, గన్నవరం విమానాశ్రయంలో ధట్టంగా పొగమంచు కమ్ముకున్నది. దాంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్రంగా పొగమంచు అలుముకోవడంతో విమానాలు దిగేందుకు ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నది. దాంతో గన్నవరంలో దిగాల్సిన పలు విమానాలు ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని గన్నవరం విమానాశ్రయం అధికారులు తెలిపారు.