5,68,717 ఎకరాల్లో వరి
13,36,347 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి
ఉమ్మడి జిల్లాలో 775 కొనుగోలు కేంద్రాలు
రైతులకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
మహబూబ్నగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సిరుల ధాన్యం పండింది. ఎంజీకేఎల్, భీమా, నెట్టెంపాడు, జూరాల, కోయిల్సాగర్ ఎత్తిపోతల నుంచి నీరు పుష్కలంగా పారింది. దీంతో 5,68,717 ఎకరాల్లో వరి పంట సాగైంది. 13,36,347 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సీఎం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో 775 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుండడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరి సిరులు కురిపిస్తున్నది. అయితే, పంట ఎక్కడ అమ్ముకోవాలో అర్థం గాక ఆందోళనకు గురైన అన్నదాతకు సీఎం కేసీఆర్ నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎప్పటిలాగే రైతుల వద్దనే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో అన్నదాతల్లో ఉన్న కొద్దిపాటి ఆందోళన ఆవిరైపోయింది. ధాన్యం విక్రయాలకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 5,68,717 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 13,36,347 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 775 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
అన్నదాతల్లో ఆనందం..
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర సర్కార్ అంగీకరించడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘రైతులు ఆందోళన పడొద్దు.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే రైతుల్లో భరోసా ఏర్పడింది. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే గతంలో మాదిరి గ్రామాల్లోనే కాంటాలు పెట్టి ధాన్యం కొంటామని సీఎం ప్రకటించారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు పుష్కలంగా అందడంతోపాటు గత వర్షాలకు చెరువులు, కుంటలు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఉమ్మడి జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగానే దిగుబడులు సైతం పెరగనున్నాయి. ఈ మేరకు ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర అందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కరోనా దృష్ట్యా ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద నీటితోపాటు సబ్బు, శానిటైజర్లను ఏర్పాటు చేయనున్నారు. ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.
రైతులకు ఇబ్బందుల్లేకుండా..
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఏ మండలంలో పంట ముందుగా వస్తే అక్కడికక్కడే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించాం. ధాన్యం కొనుగోలుపై త్వరలో అందరు ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ధాన్యం తరలించే సమయంలో రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదు. కొవిడ్ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేపడతాం.
రైతుల బతుకు ఆగమయ్యేది..
కేంద్ర ప్రభుత్వం నూతన రైతు చట్టాలను తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు నిలిపివేసిందని తెలిసి అందరం ఆందోళన చెందాం. పండించిన పంటను ఎక్కడమ్మాలె..? ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. కానీ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సంతోషంగా అనిపించింది. సీఎం కేసీఆర్ సారు చెప్పిండంటే చేస్తడు అనే నమ్మకం గట్టిగా ఉంది. అందుకే నిమ్మలంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంలా చేతులు ఎత్తేస్తే రైతుల బతుకు ఆగమయ్యేది.
ఇవి కూడా చుడండి
ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
మొసలి తలపైకి ఎక్కిన కోడి.. చివరికి ఏమైందో తెలుసా?.. వైరల్ వీడియో
కోహ్లీ వరల్డ్ రికార్డు..పాంటింగ్, సచిన్లను వెనక్కి నెట్టి!