న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నాలుగో విడత ఫలితాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు ఉండటం విశేషం. మొత్తం 9,34,602 మంది విద్యార్థులు మెయిన్స్ పరీక్ష రాశారు.
రాష్ట్రానికి చెందిన కొమ్మ శరణ్య, జోస్యూల వెంకట ఆదిత్య ఫస్ట్ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన దుగ్గినేని వెంకట పనీష్, పసల వీరశివ, కుంచనపల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గుజరాతి, అస్సామీస్, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు.
ఈ పరీక్ష ద్వారా ఎన్ఐటీ, ఐఐఐటీలతోపాటు కేంద్ర నిధులతో నడుస్తున్న సాంకేతిక విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
గౌరబ్ దాస్- కర్ణాటక
వైభవ్ విశాల్-బీహార్
దుగ్గినేని వెంకట పనీష్- ఆంధ్రప్రదేశ్
సిద్ధాంత్ ముఖర్జీ- రాజస్థాన్
రుచిర్ బన్సల్- న్యూఢిల్లీ
అమయ్య సింఘాల్- ఉత్తరప్రదేశ్
మృదుల్ అగర్వాల్- రాజస్థాన్
కొమ్మ శరణ్య- తెలంగాణ
జోస్యూల వెంకట ఆదిత్య- తెలంగాణ
అథర్వ అభిజిత్ తంబత్- మహారాష్ట్ర
కావ్య చోప్రా- ఢిల్లీ
పసల్వ వీర శివ- ఆంధ్రప్రదేశ్
కంచనపల్లి రాహుల్ నాయుడు- ఆంధ్రప్రదేశ్
కరణం లోకేష్- ఆంధ్రప్రదేశ్
పుల్కిత్ గోయల్- పంజాబ్
పాల్ అగర్వాల్- ఉత్తర ప్రదేశ్
గుర్రమ్రిత్ సింగ్- చండీగఢ్
అన్షుల్ వర్మ- రాజస్థాన్
పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ అయిన jeemain.nta.nic.in కానీ, nta.ac.in, nta.nic.in, Ntaresults.nic.in చూడవచ్చు.