సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ) : గత పన్నెండు రోజులుగా కొనసాగుతున్న ‘ఫీవర్ సర్వే’కు ప్రజలు సహకరించారని, డెంగీని నివారించే దిశలో ఇంటి పరసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జాతీయ డెంగీ దినంను పురస్కరించుకొని ఆదివారం బంజారాహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి మొక్కలు, కుండీలను స్వయంగా శుభ్రం చేసి యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు. దోమల ద్వారా వచ్చే వ్యాధి నివారణ చర్యలు, బయోలాజికల్, కెమికల్ పద్ధతులను మేయర్ పరిశీలించారు. ‘డెంగీ నివారణను మన ఇంటి నుంచే మొదలుపెడదాం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజలంతా ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల పాటు పరిశుభ్రతకు కేటాయించాలని ఈ సందర్భంగా మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు పాల్గొన్నారు. దోమల నివారణకు కూకట్పల్లిలో జరుగుతున్న వెక్టర్ కంట్రోల్ ఆపరేషన్ను మేయర్ అభినందించారు.
నగరంలో మొత్తం ఇప్పటి వరకు 317బస్తీ దవాఖానల పరిధిలో 1,97,037 ఫీవర్ సర్వే నిర్వహించగా.., అందులో 30,991 మందికి కిట్స్ ఇవ్వడం జరిగిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇంటింటా సర్వేలో భాగంగా 6,96,366 మందికి జ్వర పరీక్షలు నిర్వహించగా.., అందులో 19,671మందికి కిట్స్ ఇచ్చినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 8,93,403 మందికి సర్వే జరుపగా, 50,662 మందికి కిట్స్ అందించినట్లు చెప్పారు. ప్రజలు ఇంటినుంచి బయటకు రాకుండా.. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు.
కొవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే ఉధృతంగా కొనసాగుతున్నది. ఆదివారం 1,563 బృందాలతో 1,37,969 ఇండ్లలో సర్వే చేపట్టారు.