పాట్నా: బీహార్లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ బ్రదర్స్, లాలూ ప్రసాద్ యాదవ్ తనయులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ మధ్య మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వివాదం రాజుకున్నది. తేజ్ ప్రతాప్ యాదవ్ అనుచరుడు, ఆర్జేడీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆకాష్ యాదవ్ను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ చర్యపై తేజ్ ప్రతాప్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీని తన సొంత పార్టీగా జగదానంద్ సింగ్ భావిస్తున్నారని విమర్శించారు. పార్టీ రాజ్యాంగం ఎందుకు అనుసరించలేదు, తమ విద్యార్థి నేతకు ఎందుకు నోటీసు జారీ చేయలేదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు.
సోదరులమైన తమ ‘కృష్ణ-అర్జున్ జోడీ’ని జగదానంద్ సింగ్ విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారని తేజ్ ప్రతాప్ యాదవ్ మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను కోరుతున్నానని అన్నారు. ఒకవేళ ఆయనపై చర్యలు తీసుకోకపోతే పార్టీ కార్యక్రమాలలో తాను పాల్గోనని హెచ్చరించారు.
కాగా, దీనిపై జగదానంద్ సింగ్ స్పందించారు. తేజ్ ప్రతాప్ కోపంగా ఉన్న సంగతి తనకు తెలియదన్నారు. బహుశా ఆయన అపార్థం చేసుకుని ఉండవచ్చని తెలిపారు. ఒక చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చాలనుకోవడం సరికాదన్నారు.
మరోవైపు, ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయం ఉంటుందని తేజస్వీ యాదవ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు, తాను కలిసి అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. తమ పార్టీలో లేదా కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవన్నారు.