మూడు రోజుల పాటు పశ్చిమ తీరాన్ని చిగురుటాకులా వణికించి బీభత్సం సృష్టించిన తౌటే తుఫాను సోమవారం రాత్రి 9 గంటలకు గుజరాత్ తీరాన్ని తాకింది. అంతకుముందు అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టించింది. ముంబై తీరంలో సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అలల ధాటికి రెండు భారీ నౌకలు లంగరు తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయాయి. సహాయ చర్యల కోసం మూడు యుద్ధనౌకలను నౌకాదళం రంగంలోకి దించింది. భారీ వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ర్టాల్లో తీరప్రాంతాలు జలమయమయ్యాయి. తౌటే ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నది.
ముంబై, మే 17: మూడు రోజుల పాటు పశ్చిమ తీరాన్ని చిగురుటాకులా వణికించి బీభత్సం సృష్టించిన తౌటే తుఫాను సోమవారం రాత్రి 9 గంటలకు గుజరాత్ తీరం తాకింది. అంతకుముందు అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టించింది. సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అలల ధాటికి ముంబైలో రెండు భారీ నౌకలు లంగరు తెగిపోయి సముద్రంలో కొట్టుకుపోయాయి. రెండు నౌకల్లో కలిపి 410 మంది సిబ్బంది ఉన్నారు. భారత నౌకాదళం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. మూడు యుద్ధ నౌకలను (ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్) రంగంలోకి దింపింది. బాంబే హై ప్రాంతంలోని హీరా అయిల్ ఫీల్డ్స్ నుంచి కొట్టుకుపోయిన పీ305 నౌకను వెతకడానికి ఐఎన్ఎస్ కొచ్చి నౌక బయల్దేరింది. పీ305లో 273 మంది ఉన్నారు. జీఏఎల్ కన్స్ట్రక్టర్కు చెందిన మరో నౌకలో 137 మంది ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి వీరిలో 38 మందిని రక్షించినట్టు నేవీ అధికారులు తెలిపారు. ముంబైలో చరిత్రలోనే అత్యధికంగా గంటలకు 114కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో భారీ నష్టం సంభవించింది.
భారీ వర్షాలతో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ర్టాల్లో తీరప్రాంతాలు జలమయమయ్యాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను కారణంగా మహారాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. తుఫాన్ బీభత్సం నేపథ్యంలో ప్రధాని మోదీ మహారాష్ట్ర, గుజరాత్, గోవా సీఎంలు, డయ్యూ డామన్ లెఫ్టినెంట్ గవర్నర్తో సోమవారం మాట్లాడారు. సన్నద్ధతపై అడిగి తెలుసుకొన్నారు. సహాయక చర్యల్లో కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్లకు అవసరమైన సాయాన్ని అందించాలని త్రివిధ దళాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశించారు.
గుజరాత్లో 2లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమాన సర్వీసులను నిలిపివేశారు. విపరీతమైన గాలులు, భారీ సముద్రపు అలలు, వర్షంతో మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో తీరప్రాంతం బాగా దెబ్బతిన్నది. ముంబైలో 12వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొచ్చిలో సముద్రంలో చిక్కుకొన్న 12 మంది జాలర్లను రక్షించినట్టు ఇండియన్ కోస్ట్గార్డు తెలిపింది. తుఫాను ధాటికి ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టులో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేశారు. లోకల్ రైళ్లు కూడా రద్దయ్యాయి.
తుఫాన్ కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో ఆరుగురు చనిపోయారు. రెండు పడవలు మునిగిపోయాయి. ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. మృతుల్లో ముగ్గురు రాయ్గఢ్ జిల్లాకు చెందినవారున్నారు. ముంబై, ఉల్లాస్నగర్లో చెట్లు కూలి ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలో తుఫాను కారణంగా ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. 121 గ్రామాలపై తీవ్ర ప్రభావం పడింది. కేరళలోనూ లోతట్టు ప్రాంతాలను నుంచి ప్రజలను తరలించారు. భారీ వర్షాల కారణంగా డ్యాముల్లో నీటిమట్టం పెరగడంతో హెచ్చరికలు జారీచేశారు. వర్షాల కారణంగా కేరళలో ఏడుగురు చనిపోయినట్టు ఆ రాష్ట్ర సీఎం విజయన్ చెప్పారు.
హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): తౌటే ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం దాకా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ సోమవారం అర్ధరాత్రే గుజరాత్లో పోరుబందర్-మహువాల మధ్య తీరం దాటుతుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో అదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయంశంకర్ భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. తౌటే ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. వాతవరణం చల్లగా ఉంది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.8-40 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి.