చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రోజూ 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కూడా కొత్తగా 11,805 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అక్కడ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,78,298కి చేరింది. తమిళనాడుకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.
కరోనా మరణాలు కూడా ప్రతిరోజూ భారీగానే నమోదవుతున్నాయి. మంగళవారం కూడా కొత్తగా 267 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,068కి చేరింది. ఇక మంగళవారం 23,207 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం 1,25,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి.