సూర్యాపేట అర్బన్, ఏప్రిల్ 28 : ప్రస్తుతం ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నా యి. ఎండల తీవ్రత, వడగాలుల కారణంగా పశువులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటు ంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్రావు తెలిపారు. ఎండ వల్ల పశువులను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల వల్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు రోగాల బారిన పడతాయి. వాటి పెంపకం దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యనుంచి బయట పడవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటి పెంపకంలో తగిన యాజమాన్య పద్ధతి అవలంబిస్తే ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉండి రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.
పశువులలో వడదెబ్బ
అధిక ఉష్ణోగ్రత, కొట్టాలు, షెడ్లలో గాలి ప్రసరణ సరిగా లేకపోడం, అధిక సంఖ్యలో పశువులు ఒకే షెడ్డులో ఉండడం, ఉక్కపోత, నీటి సౌకర్యం సరిగా లేక పోవడం వంటి కారణాలతో జీవాలు వడదెబ్బకు గురవుతాయి. ఈ కారణంగా పశువులు క్ర మంగా నీరసించి బలహీనంగా మారుతాయి. సరిగ్గా నడువలేక తూలుతూ ఉంటాయి. తరచూ పడుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. జీర్ణ ప్రక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వాటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం ఉంది. చూడి పశువులలో గర్భస్రావం జరిగే ప్ర మాదం ఉంటుంది. వడదెబ్బతో దాహం పెరిగి శ్వాస కష్టమవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి.
పశువుల మేత
వేసవికాలంలో జీర్ణప్రక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణమయ్యే గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చి గడ్డిని ఉదయం, ఎండుగడ్డిని సాయంత్రం వేళల్లో అందించాలి. పాలను ఇచ్చే పశువులకు దాణా నీటితో కలిపి ఇవ్వడంతో పాటు మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణాలను ఇవ్వడం మంచిది. ఎండ సమయంలో కాకుండా, ఉదయం 6 నుంచి 10గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య పశువులను మేతకు తీసుకెళ్లాలి
ఆరోగ్య పరిరక్షణ
ఎండదెబ్బకు గురైన పశువులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో ప్రభుత్వం అందించిన టీకాలు వేయించని వారు ఈ సమయంలో తప్పకుండా వేయించాలి. ఎండ సమయంలో పశువులు మురుగునీరు తాగకుండా చూసుకోవాలి. వాటికి శుభ్రమైన నీటిని అందించాలి.
ప్రథమ చికిత్స
వడదెబ్బకు గురైన పశవులను వెంటనే నీడ, చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగాలి.తల నుదుటి మీద మంచుముక్కలను ఉంచాలి. తడి గోనె సంచిని పశువులపై కప్పాలి. అనంతరం పశువైద్యున్ని సంప్రదించి స్లైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి అవసరమైన చికిత్స అందించాలి.