చెన్నై: కూరలో కారం కాస్త ఎక్కువైతేనే మనం అల్లాడిపోతాం. కారంపొడి శరీరానికి కాస్త తగిలినా మంటెక్కిపోతుంది. అలాంటిది ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు. ఆదివారం ఆది అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో వినూత్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు జరుగుతాయి. గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం చేస్తారు. భక్తులు మద్యం, సిగరెట్లు కూడా దేవుడికి సమర్పిస్తారు.
అనంతరం సాంప్రదాయ వేడుక ప్రారంభమవుతుంది. గ్రామ దైవానికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించే పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటారు. ఆ తర్వాత ‘కారం యజ్ఞం’లో ఆయన పాల్గొంటారు. కొడవలి పట్టుకుని కూర్చొనే ఆయనపై 108 కేజీల కారం కలిపిన నీళ్లను భక్తులు తలపై నుంచి పోసి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
కాగా, భక్తులు కారం నీళ్లు పోసేంత వరకు పూజారి గోవిందం కదలకుండా మెదలకుండా ఉంటారు. మరోవైపు ఆ కారం ఘాటు వల్ల ఊపిరి పీల్చలేక భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అనంతరం పూజారి శరీరంపై కారం మరకలు పోయేంత వరకు గ్యాలన్ల నీటిని భక్తులు ఆయనపై గుమ్మరిస్తారు.