చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) విషాదాలు తమిళనాడును విడటం లేదు. ఈ పరీక్షలో అర్హత సాధించలేమన్న భయంతో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా నీట్ రాసిన మరో బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది. నమక్కల్ జిల్లాకు చెందిన 19 ఏండ్ల శ్వేత ఈ నెల 12న జరిగిన నీట్ పరీక్షకు హాజరైంది. శుక్రవారం జవాబు కీని ఆమె చూసుకున్నది. రెండోసారి నీట్ రాసిన ఆమె ఈసారి కూడా అర్హత సాధించలేనన్న ఆందోళనతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తమ కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపుపై సీఎం స్టాలిన్ ప్రభుత్వం ఇటీవల ఒక బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. నీట్ రద్దయ్యేంత వరకు పోరాడతామన్న ఆయన ఆత్మహత్య వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, నిరాశ చెందవద్దని విద్యార్థులకు సూచించారు.
కాగా, నీట్ సాధించడంపై విద్యార్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న డీఎంకే ప్రభుత్వం 24 గంటలు పని చేసే హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. ఆందోళనలో ఉన్న విద్యార్థులు 104 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి మానసిక వైద్యుల సహాయం పొందవచ్చని తెలిపింది. దీని కోసం 330 మంది నిపుణులను నియమించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రహ్మణ్యం వెల్లడించారు.
విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడవద్దని తమిళ నటుడు సూర్య కూడా సూచించారు. విద్యార్థులు తీసుకునే కఠిన నిర్ణయం వారి తల్లిదండ్రులకు జీవిత శిక్ష వంటిదని అన్నారు. తాను కూడా చాలా పరీక్షల్లో ఫెయిల్ అయిన సంగతిని ఆయన గుర్తు చేశారు. పరీక్షల కంటే జీవితంలో ఎన్నో ఉన్నాయని చెప్పారు.