ప్రపంచంలోని ఐదు అగ్రదేశాలు కలిసి దశాబ్దాలపాటు కృషిచేస్తేగానీ సాధ్యంకాని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్).. ఒంటరిగా నిర్మించడానికి చైనా సమాయత్తమైంది. గూగుల్ను కాదని.. సొంతంగా సెర్చ్ ఇంజిన్ ‘బైడూ’ను తీసుకొచ్చిన డ్రాగన్ దేశాన్ని చూసి తొలుత కొందరు నవ్వుకున్నారు. ‘ఊరందరిది ఒకదారైతే ఉలిపిరి కట్టెది ఒకదారి’ అంటూ హేళన చేశారు. కానీ, సొంత సెర్చింజిన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది చైనా. ఇప్పుడు మరో ప్రపంచ రికార్డు దిశగా ముందుకువెళ్తున్నది. రోదసి పరిశోధనల్లో ఆధిపత్యం వహిస్తున్న అగ్రదేశాలకు దీటుగా సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని నిర్మించటానికి చైనా సిద్ధమవుతున్నది. ఆ బృహత్తర ప్రయోగంలో నేడు తొలి అడుగు వేయబోతున్నది. – బీజింగ్
అంతరిక్షంలో మనుష్యుల మనుగడకు సంబంధించిన ప్రయోగాలు, ఉపగ్రహాలపై పర్యవేక్షణ, వాటికి అవసరమైన మరమ్మతులు, వ్యోమగాముల నివాసం, తరలింపు తదితర అవసరాలకు ఐఎస్ఎస్ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, తాము పంపిన ఉపగ్రహాలకు సంబంధించిన సేవలను పర్యవేక్షించేందుకు సొంతంగా తమకు మాత్రమే ప్రత్యేక అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉండాలని చైనా భావించింది. ‘టియాన్హే’ (ఇంగ్లిష్లో హెవెన్లీ హార్మొనీ అని పిలుస్తున్నారు) అనే పేరుతో సొంతగా అంతరిక్ష కేంద్రానికి రూపకల్పన చేసింది. 11 మిషన్లతో రూపొందించే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గురువారం రాత్రి తొలి ప్రయోగాన్ని చేపట్టనున్నారు. దక్షిణ చైనాలోని హైనాన్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ‘లాంగ్ మార్చ్ 5బీ’ రాకెట్ ద్వారా ‘టియాన్హే’ నిర్మాణానికి అవసరమైన కొంత సామగ్రిని తీసుకెళ్లనున్నారు.
ప్రపంచంలోని అన్ని స్పేస్ ఏజెన్సీలకు సేవలను అందించే ఉద్దేశంతో దేశాలన్నీ కలిసి అంతర్జాతీయ సమాఖ్యగా ఏర్పడి 20 నవంబర్, 1998లో ఐఎస్ఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే, ఐఎస్ఎస్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాసా (అమెరికా), రోస్కోస్మాస్ (రష్యా), జాక్సా (జపాన్), ఈఎస్ఏ (ఐరోపా), సీఎస్ఏ (కెనడా) వంటి స్పేస్ ఏజెన్సీలే దాని కార్యకలాపాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాయి. దీంతో చైనా చేపట్టే రోదసి ప్రయోగాలు, ఉపగ్రహాల మరమ్మత్తులు, మానవసహిత యాత్రలపై ఆ దేశాలు ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి తమకు పూర్తి సమాచారం ఇవ్వకుండా చైనా ఏకపక్షంగా ప్రయోగాలు చేస్తున్నదని ఆరోపించాయి. ఇవన్నీ గమనించిన చైనా.. సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని నిర్మించుకుంటే తమ ప్రయోగాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించి ‘టియాన్హే’ నిర్మాణానికి సిద్ధమైంది.
అంగారక, చంద్ర యాత్రల కోసం..
357.6 అడుగుల పొడవున్న ఐఎస్ఎస్తో పోలిస్తే ‘టియాన్హే’ సైజు (సుమారు 82 అడుగులు) చిన్నగా ఉన్నప్పటికీ.. సౌకర్యాలు, సేవల విషయంలో ఐఎస్ఎస్కు ఇది ఏ మాత్రం తీసిపోదు. ‘టియాన్హే’ స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం 11 దఫాల్లో రాకెట్ల ద్వారా సామగ్రిని తరలించనున్నారు. అలాగే, కనీసం 12 మంది వ్యోమగాములు దాంట్లో ఉండేందుకు వీలుగా సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాదికి అందుబాటులోకి వచ్చే ఈ అంతరిక్ష కేంద్రం సాయంతో భవిష్యత్తులో తాము చేపట్టే అంగారక, చంద్ర యాత్రలను పర్యవేక్షించాలని చైనా భావిస్తున్నది.