తిరుపతి,మే 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి10.30 గటంల వరకు ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.కాగా సాయంత్రం 5.30 గంటలకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవోరాజేంద్రుడు, ఏఈవో రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు ఏ.పి.శ్రీనివాస దీక్షితులు, కంకణ బట్టార్ ఏ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్లు వెంకటాద్రి,అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.