న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంతరం స్టాలిన్ తన భార్య దుర్గావతీ స్టాలిన్తో కలిసి సోనియా నివాసానికి వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి ఢిల్లీ వచ్చిన సీఎం స్టాలిన్ తమిళనాడులో కొత్త ప్రభుత్వం అమల చేస్తున్న పథకాలు, ప్రభుత్వ విధానాలను సోనియా, రాహుల్కు వివరించారు. కాగా, సోనియా గాంధీ, తాను సీఎం స్టాలిన్, ఆయన భార్యతో సమావేశం కావడం సంతోషంగా ఉన్నదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తమిళ ప్రజల కోసం శక్తివంతమైన, సుసంపన్న రాష్ట్రాన్ని నిర్మించడానికి డీఎంకేతో కలిసి పని చేస్తామని అన్నారు.