చెన్నై: ఆక్సిజన్ ఉత్పత్తి కోసం వేదాంత సంస్థకు చెందిన స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ను నాలుగు నెలలు తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం సోమవారం అనుమతి ఇచ్చింది. రాగి ఉత్పత్తికి అనుమతించబోమని, కరోనా తీవ్రత నేపథ్యంలో కేవలం ఆక్సిజన్ ఉత్పత్తి కోసమే అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్లాంట్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని పేర్కొంది. సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
స్టెర్లైట్ ప్లాంట్ తమిళనాడుకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా డీఎంకే చీఫ్ స్టాలిన్ డిమాండ్ చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి తప్ప మరే ఇతర ఉత్పత్తిని ప్లాంట్ చేపట్టరాదని, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, కాపర్ ప్లాంట్ను వ్యతిరేకించిన స్థానిక ప్రజలను కూడా ఈ కమిటీలో చేర్చాలని, అప్పుడే వారికి దాని గురించి పూర్తిగా తెలుస్తుందని డీఎంకే నాయకురాలు, తూతుకుడి ఎంపీ కనిమోళి సూచించారు.
2018లో ప్లాంట్కు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలుపగా పోలీస్ కాల్పుల్లో 17 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ను తమిళనాడు ప్రభుత్వం మూసివేసింది. కాల్పుల ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నది. మరోవైపు ప్లాంట్ను తెరువాలన్న వేదాంత సంస్థ అభ్యర్థనలను తొలుత మద్రాస్ హైకోర్టు, గత ఏడాది సుప్రీంకోర్టు తిరస్కరించాయి.