చెన్నై: తమిళనాడులో స్కూళ్లు తెరిచిన మూడు రోజుల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. రెండు వారాల్లో 83 మంది స్కూలు విద్యార్థులకు కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 9-12 తరగతుల విద్యార్థులకు స్కూళ్లలో ప్రత్యక్షంగా బోధిస్తున్నారు. అయితే గత 14 రోజుల్లో 83 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రధానంగా కోయంబత్తూరులోని స్కూళ్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మరోవైపు ఇక్కడి స్కూళ్లలో విద్యార్థుల హాజరు కూడా తక్కువగానే ఉన్నది. అయితే కరోనా సోకిన విద్యార్థుల్లో ఎలాంటి లక్షణాలు లేవని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా సుబ్రహ్మణ్యం తెలిపారు.
కాగా, సామాజిక దూరం పాటించకపోవడం వల్లనే విద్యార్థులకు కరోనా సోకుతున్నదని నిఫుణులు అంచనా వేశారు. స్కూళ్లు తెరిచిన తర్వాత సామాజిక, కరోనా మార్గదర్శకాలను పక్కాగా పాటించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. మరోవైపు విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో 1-8వ తరగతి విద్యార్థులకు తరగతుల పునరుద్ధరణపై ఆ రాష్ట్ర విద్యాశాఖ పునరాలోచనలో పడింది. సీఎం స్టాలిన్కు సమగ్ర నివేదిక పంపామని, పరిస్థితిని సమీక్షించిన తర్వాత మిగతా తరగతుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ తెలిపారు.
మరోవైపు విద్యార్థులకు కరోనా సోకుతుండటంతో స్కూళ్లను మూసివేయాలంటూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.