న్యూఢిల్లీ: తాలిబన్లు ఊహించని వేగంతో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించేశారని, అది కొంత ఆశ్చర్యానికి గురి చేసినట్లు త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ( Bipin Rawat )అన్నారు. అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాలిబన్లు ఒకవేళ ఆఫ్ఘన్ దాటి వికృతాలకు పాల్పడితే, అలాంటి ఘటనలు ఇండియాలో చోటుచేసుకుంటే, వాటికి ధీటైన బదులిస్తామని బిపిన్ తెలిపారు. క్వాడ్ దేశాలు ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు మరింత సహకారాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు వశపరుచుకుంటారని తెలుసని, కానీ ఇంత వేగంగా ఆ ప్రక్రియ జరగడం ఆశ్చర్యపరిచినట్లు రావత్ వెల్లడించారు. దీని గమనిస్తే, గత 20 ఏళ్లలో తాలిబన్లు తమ పట్టుకోల్పోలేదని తెలుస్తోందన్నారు. ఓఆర్ఎఫ్ సదస్సులో ఇండోపసిఫిక్ కమాండ్ అడ్మిరల్ జాన్ అక్విలినో పాల్గొన్నారు.