న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భారత ప్రభుత్వం చేపడుతున్న తరలింపు చర్యలపై కేంద్రమంత్రి జైశంకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిపై వివిధ పార్టీల నేతలకు ఆయన వివరించారు. ఆఫ్ఘన్లో ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని జైశంకర్ చెప్పారు. బుధవారం 35 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఖతార్ రాజధాని దోహాలో జరిగిన శాంతి ఒప్పందంలో తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా జైశంకర్ అన్నారు. ఆప్ఘనిస్తాన్లో ఉన్న వారిని తరలించడమే తక్షణ కర్తవ్యమని అఖిల పక్ష నేతలతో ప్రభుత్వం పేర్కొన్నది. దీర్ఘకాలికంగా ఆఫ్ఘనిస్తానీలతో స్నేహ సంబంధాలను ఆశిస్తున్నట్లు మంత్రి జైశంకర్ తెలిపారు.