న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని నెలలుగా జోరుమీదున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్ళి వెలవెలబోయ్యాయి. పెట్టుబడిదారులు తమ నిధులను ఈక్విటీల్లోకి మళ్లించడంతో గత నెలలో పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైనట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) వెల్లడించింది. ఏప్రిల్ నెలలో రూ.680 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అలాగే మార్చిలో రూ.662 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు..అంతకుముందు నెలలో రూ.491 కోట్లు, జనవరిలో రూ.625 కోట్ల మేర ఇన్వెస్ట్చేశారు. కానీ, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్(ఏయూఎం) కింద గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చే పెట్టుబడులు ఆరు శాతం పెరిగి రూ.16,625 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఈక్విటీ మార్కెట్లు అంచనాలకుమించి రాణించడంతో పెట్టుబడిదారులు తమ నిధులను వీటివైపు మళ్లించడంతో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని మార్నింగ్స్టార్ ఇండియా డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. జనవరి 2020 నుంచి మే 2021 వరకు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.9,377 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి.