న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత సువెందు అధికారి మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులు ఖాయమన్న ఊహాగానాల నేపథ్యంలో సువెందు.. అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన కేంద్ర నౌకాయానశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిశారు. సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలువనున్నారు. బుధవారం సువెందు అధికారి ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. గత ఏప్రిల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని నందిగ్రామ్లో సువెందు అధికారి ఓడించారు. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష నేతగా ఆయన కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. గతేడాది తృణమూల్ కాంగ్రెస్ను వీడిన సువెందు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.