ముంబై : పంజాబ్ కాంగ్రెస్లో వర్గ పోరు శ్రుతిమించిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంప్రదాయంగా వస్తున్న చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ నేడు కనుమరుగైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్ధితి తనను బాధిస్తోందని షిండే పేర్కొన్నారు.
పార్టీ ప్రస్తుత స్థితిలో మేథోమథనం సాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. మన విధానాలు లోపభూయిష్టంగా ఉండవచ్చు..వాటిని సరిదిద్దుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు షిండే వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీనియర్ నేత లేవనెత్తిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాలని హితవు పలికారు.కాగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్లో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.