న్యూఢిల్లీ, మే 19: రోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో మనోళ్లే టాప్లో ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారంలో 5 నుంచి 7 సార్లు ఇంటిని శుభ్రపరుచుకుంటున్నారు. దాదాపు 46 శాతం మంది పరిశుభ్రతను పాటిస్తున్నారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో మన దేశంలోనే తరచుగా ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారట. 30 వేల మందిపై డైసన్ టెక్నాలజీ కంపెనీ ఈ అధ్యయనం చేసింది.
కరోనా మహమ్మారి భయం నేపథ్యంలో గత సంవత్సరం శుభ్రం చేసుకుంటున్నట్టే 95 శాతం మంది ఈ ఏడాది కూడా ఇంటిని శుభ్రపరుచుకుంటున్నారని తేలింది. అయితే ఇంట్లో నేలపై దుమ్మును చూడగానే భారత్లో చాలా తక్కువ మంది స్పందిస్తున్నారని అధ్యయనం తెలిపింది. ప్రతి ముగ్గురిలో ఒక్కరు మాత్రమే దుమ్ము చూడగానే తుడుస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది వెంటనే శుభ్రం చేస్తున్నారు.