కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎన్నికల సంఘం కారణమని మద్రాస్ హైకోర్టు ఓ కేసు వాదనల సందర్భంగా అభిప్రాయపడింది. హత్యానేరం కింద ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టాలన్నది. ఇది తీవ్రమైన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలను పత్రికలు ప్రకటించాయి. ఈ మౌఖిక వ్యాఖ్యానాలను మీడియా ప్రచురించకుండా ఆదేశించాలని ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. నోటిమాట ద్వారా కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆపే విధంగా ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు బెంచి అభిప్రాయపడింది.
భావ ప్రకటనా స్వేచ్ఛ ఈ మౌఖిక వ్యాఖ్యానాలకు కూడా వర్తిస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కోర్టు గదుల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. అందుకని మీడియాకు ఉన్న ఈ స్వేచ్ఛను నిరోధించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ప్రొసీడింగ్స్ను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మన దేశంలో కోర్టులు బహిరంగంగా పనిచేస్తాయి. కోర్టు కార్యకలాపాలను ఎవరైనా చూడవచ్చు. గోప్యంగా జరిగే విచారణలను, వాదనలను మాత్రం మీడియా కోర్టు అనుమతి లేకుండా ప్రచురించడానికి వీల్లేదు.
కోర్టు బహిరంగంగా పనిచేయడం వల్ల అవి ప్రజలకు జవాబుదారీతనం వహిస్తాయి. ప్రజల విశ్వాసం ఉండాలంటే కోర్టు బహిరంగంగా పనిచేయాలి. ప్రజల పరిశీలన వల్ల కోర్టుల మీద ప్రజల విశ్వాసం పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రజలు చర్చించడం ద్వారా, విమర్శించడం ద్వారా న్యాయమూర్తులు తమ చర్యలను సరిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. కోర్టు కార్యకలాపాలను మీడియా రిపోర్టు చేయడం వల్ల కోర్టుల గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా న్యాయ ప్రక్రియకు కూడా న్యాయం జరుగుతుంది. కోర్టు కార్యకలాపాలను మీడియా లో రిపోర్టు చేయడం మీడియా హక్కు. ఈ హక్కును సుప్రీంకోర్టు బలపరుస్తుందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈసీ దాఖలు చేసిన ఈ కేసు కారణంగా కోర్టు కార్యకలాపాలు రిపోర్టు చేయకుండా నిరోధిస్తే అది రాజ్యాంగం ప్రసాదించిన హామీలకు భంగం వాటిల్లుతుందని కూడా అభిప్రాయ పడుతూ ఈసీ దరఖాస్తును కోర్టు కొట్టివేసింది.
కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. కానీ న్యాయమూర్తుల అధికారానికి కూడా పరిమితులు ఉం టాయి. కటువైన వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కోర్టులు జాగ్రత్త వహించాలి. హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్న వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి, కటువైనవి. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టులు చేసేముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే మద్రాస్ హైకోర్టు మాటలు కేసు రికార్డులో లేవు కాబట్టి వాటిని తొలగించే ప్రసక్తే రాదని కోర్టు అభిప్రాయపడింది. ఎలక్షన్ కమిషన్, హైకోర్టు రెండూ రాజ్యాంగ సంస్థలు. కోర్టులు బహిరంగంగా ఉన్న విధంగా మరే రాజ్యాంగ సంస్థ ఉండటం లేదు. కోర్టు నిర్ణయాలకు తగు కారణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కటువుగా ఉన్నప్పటికీ అవి ప్రజల నుంచి మెప్పును పొందాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మద్రాస్ హైకోర్టుకు ప్రశంసలు వచ్చాయి. ప్రజల ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైనది. దీన్ని విస్మరించి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నో దశల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రత మీద మబ్బు లు కమ్ముతున్నాయి. స్థానికంగా ఉన్న అంశాలు, దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులు మద్రాస్ హైకోర్టు ఆ విధంగా మాట్లాడటానికి దారి తీశాయని చెప్పవచ్చు.
రాజకీయ పార్టీలను నేరుగా అనకుండా ఎన్నికల కమిషన్ మీద మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యానం చేసిందని అన్పిస్తుంది. తెలంగాణలో, ఏపీలో కౌన్సిల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మహమ్మారి కాలంలో ఎన్నికల నిర్వహణకు తగు సూచనలను కోర్టు ఇస్తే బాగుండేది.
మంగారి రాజేందర్