న్యూఢిల్లీ, ఆగస్టు 27: రెడీమేడ్ దుస్తుల కొలతలు తరచూ తికమకపెడుతూ ఉంటాయి. అమెరికా బ్రాండ్ అంగీపై ‘మీడియం’ అని ఉన్నా మన దేశంలో లావుపాటి వ్యక్తికి సరిపోతుంటుంది. యూరప్ బ్రాండ్ షర్టులు భుజాల కొలత సరిపోయినా చేతులు పొడవై వేలాడుతుంటాయి. ఆన్లైన్లో కొనుక్కొన్న దుస్తులు సరిపోక రిటర్న్ చేయడంలో శ్రమ, సమయం వృథా అవుతుంటాయి. ఈ గందరగోళానికి తెరదించేందుకు మన దేశంలో ఒక సర్వేను గురువారం ప్రారంభించారు. ‘ఇండియా సైజ్’ అని పేరు పెట్టిన ఈ సర్వేను జౌళి పరిశ్రమ శాఖ, జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ (నిఫ్ట్) కలిసి నిర్వహిస్తున్నాయి. రెడీమేడ్ దుస్తులకు సంబంధించి భారత్కు ప్రత్యేకంగా కొలతల ప్రమాణాలను నిర్ణయించడం ఈ సర్వే లక్ష్యం. ఈ ప్రాజెక్టును 2019లో ప్రకటించినప్పటికీ కరోనా వల్ల ఆలస్యమైంది.
5 ప్రాంతాల్లో సర్వే
భారత్లో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాల్లో వస్త్ర పరిశ్రమది రెండో స్థానం. రూ.14 వేల కోట్ల వస్త్ర వ్యాపారం జరుగుతున్నది. ఇందులో రూ.10 వేల కోట్లు భారత్లో వినియోగదారుల నుంచే వస్తున్నది. రూ.4 వేల కోట్లు మాత్రమే ఎగుమతుల ద్వారా లభిస్తున్న ఆదాయం. ఈ నేపథ్యంలో ప్రామాణిక కొలతల అవసరం కనిపిసున్నది. దీని కోసం ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, షిల్లాంగ్, కోల్కతా ప్రాంతాల్లో ఇండియా సైజ్ నిర్వహించనున్నట్టు జౌళి శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ తెలిపారు. మ్యాపింగ్, కేటగరైజేషన్, శరీర ప్రమాణం, తరహా ఆధారంగా నిర్ణయించిన సైజ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కొత్తగా రూపొందించే చార్ట్లో ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 18 దేశాలకు మాత్రమే తమ సొంత కొలతల చార్టులు ఉన్నాయి.
100 అంశాల డాటా
ప్రస్తుతం ఢిల్లీలో సర్వే కొనసాగుతున్నది. దీనిలో 5,700 మంది పాలుపంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరి నుంచి శరీరాకృతికి సంబంధించి శాస్త్రీయంగా 100 అంశాల డాటాను సేకరిస్తున్నామని నిఫ్ట్ డీజీ శంతమను తెలిపారు. ఈ సర్వేకు భారత వస్త్ర తయాదారుల సంఘం (సీఎంఏఐ) సహకరిస్తున్నది. 2022 చివరికల్లా సర్వే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ చార్ట్ తయారైతే అంతర్జాతీయ సంస్థలు దాన్ని అనుసరించేలా చర్యలు తీసుకుంటారు.