న్యూఢిల్లీ : భారత్లో సోమవారం ఒకేరోజు అత్యధిక సంఖ్యలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ సాగడం పట్ల కేంద్ర ప్రభుత్వం హడావిడి చేస్తోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గతంలో పోలియో వ్యాక్సినేషన్ ప్రక్రియ సందర్భంగా ఇదే ఫీట్ను కాంగ్రెస్ హయాంలో సాధించినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన పోస్టర్లతో ప్రచారం చేసుకోలేదని వ్యాఖ్యానించింది. నిన్న ఒక్కరోజే 80 లక్షల వ్యాక్సిన్లను వేయడం పట్ల తాము సంతోషంగానే ఉన్నామని, అయితే గతంలో ఒక్కరోజులోనే పోలియో వ్యాక్సినేషన్ సందర్భంగా అత్యధికంగా 17 కోట్ల వ్యాక్సిన్లు వేశారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. మహమ్మారిపై పోరులో ప్రభుత్వం కీలక అడుగులు వేసిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ వెనక్కిలాగేలావ్యవహరిస్తోందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే ప్రారంభమైందని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో అత్యధిక కేసులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని బీజేపీ నేత పేర్కొన్నారు.