న్యూఢిల్లీ, మే 7: దేశ రాజధాని ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దీనిని కొనసాగించాలని పేర్కొన్నది. ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
కర్ణాటక ప్రజలను అలా వదిలేయలేం..
కర్ణాటకకు కేటాయించిన ఆక్సిజన్ కోటాను రోజుకు 965 మెట్రిక్ టన్నుల నుంచి 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కరోనా సంక్షోభ సమయంలో కర్ణాటక ప్రజలను అలా దిక్కుతోచని స్థితిలో వదిలేయలేమని వ్యాఖ్యానించింది. కర్ణాటక హైకోర్టు.. పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించే ఆ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నది.