న్యూఢిల్లీ: పన్నెండో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. విద్యార్థులు భౌతికంగా హాజరై పరీక్షలు రాసే అవకాశం కల్పించాలంటూ పేరెంట్స్ యూనియన్లు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ ప్రతిపాదించిన విధానం సమంజసంగా, న్యాయంగా ఉన్నదని తెలిపింది. ఈ విధానంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. విద్యా రంగంలోని నిపుణులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలు చేశారని తెలిపింది. ఎవరికీ ప్రతికూలత లేకుండా పరిపూర్ణ స్థాయిలో ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు పేర్కొన్నది. దీనిపై రెండో ఆలోచనకు తావులేదని స్పష్టం చేసింది.