లక్నో : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రేపటి దేశవ్యాప్త నిరసన కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం మద్దతు ప్రకటించారు. రైతుల పట్ల సానుభూతి వైఖరిని అవలంబించాలని కేంద్రాన్ని ఆమె కోరారు. రైతుల ఆందోళన ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మే 26న బ్లాక్ డే పాటించాల్సిందిగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
కేంద్రం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరోనా తీవ్ర విపత్తులోనూ రైతులు నిరంతరం ఆందోళన చేస్తున్నారన్నారు. ఆరు నెలల ఉద్యమం పూర్తయిన సందర్భంగా మే 26 న దేశవ్యాప్త నిరసన కార్యక్రమానికి బీఎస్పీ మద్దతు ఇస్తుందన్నారు. రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.