జైపూర్: పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఒక యువతిపై ముగ్గురు రెండేండ్లుగా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 2019 ఏప్రిల్లో 20 ఏండ్ల విద్యార్థిని పరీక్షలు రాసేందుకు కాలేజీకి వెళ్లగా అల్వార్లోని ఎస్ఎండీ సర్కిల్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఒక చోటుకు తీసుకెళ్లి ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే ఏడాది మే నెలలో బాధితురాలు మలఖేరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నిర్లక్ష్యం వహించి కేసు నమోదు చేయకపోగా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీనిని అలుసుగా తీసుకున్న నిందితులు ఆ యువతిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి రెండేండ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ ఏడాది జూన్ 25న నిందితుల్లో ఒకరైన గౌతమ్ సైని ఆమెకు ఒక వీడియో పంపాడు. తనను కలవకపోతే దానిని ఆమె కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడు. రెండు రోజుల తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు ఎస్పీ తేజస్విని గౌతమ్ను ఆశ్రయించింది. అనంతరం అల్వార్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
మరోవైపు బాధితురాలి ఫిర్యాదుపై మలఖేరా పోలీసులు కూడా జూన్ 28న కేసు నమోదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు, స్టేట్మెంట్ రికార్డు తర్వాత చివరకు ప్రధాన నిందితులైన వికాస్, భురు జాట్తోపాటు మరో నిందితుడు గౌతమ్ సైనిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన సైనిపై ఐటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే రెండేండ్ల కిందట బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక నిర్లక్ష్యం వహించిన పోలీసులపై దర్యాప్తు చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అల్వాల్ రూరల్ సర్కిల్ అధికారి అమిత్ సింగ్ తెలిపారు.