న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్-గ్రాడ్యుయెట్ సూపర్ స్పెషాలిటీ (నీట్ ఎస్ఎస్) పరీక్ష-2021 సిలబస్లో కేంద్రప్రభుత్వం చివరి నిమిషంలో మార్పులు చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. యువ వైద్యులను ఫుట్బాల్స్గా భావించొద్దని హితవు పలికింది. సిలబస్లో మార్పులు వేలాది విద్యార్థుల జీవితాల్ని ప్రభావితం చేస్తాయని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుచేయకుండా నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేస్తున్నదని ప్రశ్నించింది. సిలబస్లో మార్పులు చేయాల్సివస్తే వచ్చే ఏడాది చూసుకోవాలని, ఇప్పుడు కాదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్రంపై మండిపడింది. అధికారులతో సంప్రదించి.. స్పందనను అక్టోబర్ 4న తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏమిటీ వివాదం?
నీట్ ఎస్ఎస్ పరీక్షలో 40 శాతం ప్రశ్నలు జనరల్ మెడిసిన్, మిగతా 60 శాతం ప్రశ్నలు సూపర్ స్పెషాలిటీ సిలబస్ నుంచి ఇచ్చేవారు. అయితే, వచ్చే నవంబర్ 13, 14న నిర్వహించనున్న నీట్ ఎస్ఎస్-2021 ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలు జనరల్ మెడిసిన్ నుంచే వస్తాయని ఆగస్టు 31న కేంద్రం సిలబస్లో మార్పులు చేసింది. పరీక్షకు నెల సమయం ఉందనగా సిలబస్లో కేంద్రం ఏకపక్షంగా మార్పులు చేయడం, మారిన సిలబస్ జనరల్ మెడిసిన్ అభ్యర్థులకు అనుకూలంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తూ 41 మంది యువ వైద్యులు ఈ పిటిషన్ను దాఖలు చేశారు.