నల్లగొండ ప్రతినిధి, జూలై 8(నమస్తే తెలంగాణ) : వ్యవసాయంతో ముడిపడి ఉన్న అన్ని రకాల రుణాలకు పెద్దపీట వేస్తూ 2021-22 నల్లగొండ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. మొత్తం రూ.7303.57 కోట్ల రుణాలను ఈ ఏడాది వివిధ వర్గాల ప్రజలకు అందజేయాలని అధికార యంత్రాంగంనిర్ణయించింది. ఆ మేరకు రూపొందించిన ప్రణాళికను నల్లగొండలోని
గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో గురువారం విడుదల చేసింది. అందులో సింహ భాగంగా 80.20 శాతం రుణాలను వ్యవసాయ సంబంధ రంగాలకే కేటాయించింది. మిగతా మొత్తంలో పరిశ్రమలు, ఉన్నత విద్య, గృహ నిర్మాణాలకు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రాధాన్యత లేని రుణాల కింద మరో 396.55 కోట్లను కేటాయించింది. ప్రణాళికలో నిర్దేశించిన విధంగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి జగదీశ్వర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ కాళిందిని, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల పరంగా మంజూరు చేయనున్న రుణ ప్రణాళికలో పంట రుణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం రుణాల్లో 52.70 శాతం రుణాలను పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసమే వినియోగించేలా కేటాయించారు. జిల్లా మొత్తం వార్షిక రుణ ప్రణాళిక 7,303.57 కోట్లతో సిద్ధ్దం చేశారు. మొత్తం 3,94,098 లబ్ధిదారులకు వీటిని అందజేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కూడా మరింత విరివిగా వ్యవసాయానికి రుణాలు ఇచ్చే విధంగా ప్రణాళికను సిద్ధ్దం చేశారు. అధికభాగం వ్యవసాయ సంబంధిత రంగాలకే రుణాలు దక్కేలా చర్యలు తీసుకున్నారు. వీటికి సంబంధించి రంగాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను కూడా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వ్యవసాయ రుణ ప్రణాళికలోని అంశాల ప్రకారం మొత్తం రుణాల్లో 52.70శాతం రుణాలను పంటలకే ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 3,35,988 లబ్ధిదారులకు 3,848.70 కోట్ల రూపాయల పంట రుణాలను సాగు చేసే రైతులకు అందజేయడం లక్ష్యంగా నిర్దేశించారు.
వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఈ రుణ ప్రణాళికను ఖరారు చేశారు. టర్మ్ లోన్ల కింద వ్యవసాయ పెట్టుబడి రుణాలుగా 8,953 ఖాతా దారులకు 319.44 కోట్లు, అనుబంధ కార్యకాలాపాల నిర్వహణ రుణాలుగా 8,458 మంది ఖాతాదారులకు 165.89 కోట్ల రూపాయలను అందజేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తం రుణాల్లో ఇవే 59.34శాతంతో 4334.03 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక వ్యవసాయంలో మౌలిక వసతుల కల్పన కోసం 200.04 కోట్ల రుణాలు, అసిలెరీ(వ్యవసాయ అనుబంధం) రుణాల కింద మరో రూ.1,323 కోట్ల టర్మ్ రుణం కింద కేటాయించారు. ఇవన్నీ వ్యవసాయాభివృద్ధ్దికి తోడ్పాటునందించే రుణాలు కావడం విశేషం. మొత్తంగా చూస్తే 3,64,527 మంది ఖాతాదారులకు 5,857.57 కోట్ల రూపాయలను రుణాలుగా వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు అందించాలని నిర్దేశించారు.
పరిశ్రమలకు 645.85 కోట్ల రుణాలు
జిల్లాలోని పరిశ్రమల రంగానికి ప్రోత్సాహం అందించేలా కూడా రుణ ప్రణాళిక తగిన ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 645.85 కోట్ల రుణాలను 17,435 ఖాతాదారులకు ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా విభజించి వేర్వేరుగా ప్రణాళికలో చోటు కల్పించారు. సూక్ష్మ పరిశ్రమల విభాగంలో 8,639 ఖాతాదారులకు 207.33 కోట్ల రుణాలను, చిన్న పరిశ్రమల విభాగంలో 8,610 ఖాతాదారులకు 385.28 కోట్ల రుణాలను అందజేయాలని నిర్ణయించారు. ఇక మధ్య తరహా పరిశ్రమల విభాగంలో 186 మందికే 51.24 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం రుణ ప్రణాళికలో వీటి భాగం 8.84శాతంగా ఉంది.
విద్య, గృహాలు, ఇతరాలకు 403.60కోట్లు.
ఇక ఇతర ప్రాధాన్యత రం గాల రుణాల్లో గృహరుణాలకు పెద్దపీట లభించింది. విద్యా, గృహ, సామాజిక వసతుల కల్పన, శక్తి ఉత్పాదక లాంటి విభాగాలకు మొత్తం రుణ ప్రణాళికలో 5.52 శాతంతో 403.60కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యా సంబంధిత రుణాల విషయంలో 2,131 ఖాతాదారులకు 106.20 కోట్లు, గృహ నిర్మాణాలకు 2,208 ఖాతాలకు 220.50 కోట్లు, సామాజిక వసతుల కల్పన విభాగంలో 29.44కోట్లు, విద్యుత్తు లేదా ఇతర శక్తి ఉత్పాదక రంగంలో 47.46 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇవి కాకుండా అప్రాధాన్యత రంగంలోనూ 396.55 కోట్ల రుణాలను ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే ప్రాధాన్యత రంగాలకు 6907.02 కోట్ల రుణాలు, అప్రాధాన్యత రంగాల మిగిలిన రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ రుణ ప్రణాళికను యుద్ధ్ద ప్రతిపాదికన అమలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వర్రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్యం ఈ సందర్భంగా బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ ఏజీఎం శరత్చంద్ర, నాబార్డ్ డీడీఎం సత్యనారాయణ, అదనపు పీడీ సరస్వతి తదితరులు భాగస్వాములయ్యారు.