న్యూఢిల్లీ: వేసవి సెలవుల తర్వాత సోమవారం సుప్రీంకోర్టులో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. దురద్రుష్టవశాత్తు కరోనా మహమ్మారికి బలై పోయిన 77 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలో న్యాయమూర్తులు నివాళులు అర్పించారు.
మహమ్మారితో దుర్మరణం పాలైన న్యాయవాదులకు వ్యక్తిగతంగా తన తరఫున, తన సహచర జస్టిస్ల తరఫున హృదయ పూర్వక సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు మొదటి రూమ్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలో సంతాపం ప్రకటించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
దుర్మరణం పాలైన న్యాయవాదుల ఆత్మకు శాంతి చేకూర్చేందుకు సంస్మరణ కార్యక్రమం నిర్వహించినందుకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే కరోనాతో కోర్టులు పనిచేయక ఇబ్బందుల్లో ఉన్న న్యాయవాదులకు ప్రభుత్వం సాయం చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. ఈ పరిణామాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) స్వాగతించింది.
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ధన్యవాదాలు తెలిపారు. భారత న్యాయవ్యవస్థకు సారధ్యం వహిస్తున్న వ్యక్తి.. తొలిసారి.. సుదీర్ఘ కాలం తర్వాత న్యాయవాదుల కష్టాలు విని వారి ఇబ్బందుల పరిష్కారానికి తగిన రీతిలో స్పందించారని పేర్కొన్నారు.