న్యూఢిల్లీ : గూడ్సు రైళ్లు దుమ్మురేపాయి. రాజధాని రైలును మించి దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్సీ)లో శనివారం మూడు రైళ్లు సగటున 99 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. ఇందులో ఒక రైలు గంటకు 99.38 కిలోమీటర్ల రికార్డు వేగంతో ప్రయాణించింది. అత్యంత వేగంతో నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా సరుకు రవాణా రైలు గమ్యాన్ని చేరింది.
రాజధాని 97.85 కిలోమీటర్ల రికార్డును వెనక్కి నెట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత ఏడాది డిసెంబర్ 29న ప్రధాని నరేంద్ర మోడీ ఈడీఎఫ్సీని జాతికి అంకితం చేశారు. న్యూ ఖుర్జా- న్యూ భావ్పూర్ మధ్య 351 కిలోమీటర్ల దూరం ఉండగా.. గూడ్స్ ట్రైన్ 3.20 గంటల్లో గమ్యాన్ని చేరుకుంది. ఇప్పటి వరకు 137 రైళ్లు ఈ మార్గంలో 90 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించాయని అధికారులు పేర్కొన్నారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 306 కిలోమీటర్ల రేవారి – మాదర్ విభాగంలోనూ గూడ్స్ ట్రైన్లు 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయని అధికారులు పేర్కొన్నారు. డబ్ల్యూడీఎఫ్ జనవరి 7న ప్రారంభం కాగా.. ఈడీఎఫ్సీ, డబ్ల్యూడీఎఫ్లో నాలుగువేలకుపైగా రైళ్లు నడుస్తున్నాయి.
డబ్ల్యూడీఎఫ్లో సగటు వేగం 89.50 కిలోమీటర్లకు చేరాయని తెలిపారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ వేగంగా వెళ్లే రైలు ఖర్చును తగ్గిస్తుందని, ఫలితంగా మరింత తక్కువ ధరలుంటాయన్నారు. ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నుంచి కరోనా ప్రేరేపిత లాక్డౌన్ నుంచి ప్యాసింజర్ రైళ్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫలితంగా సరుకు రవాణా రైళ్ల సగటు వేగం 60 శాతం పెరిగింది. సాధారణ సమయాల్లో రైల్వే నెట్వర్క్లోని సరుకు రవాణా ట్రైన్లు సగటున 24 గంటకు కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. దేశంలో ఆరు జోన్లు సరుకు రవాణా రైళ్లు గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేశాయని నివేదిక పేర్కొంది.