న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశ భద్రత కారణాల దృష్ట్యా పెగాసస్ వ్యవహారంపై సవివరంగా అఫిడవిట్ను సమర్పించలేమంటూ కేంద్రం చేసిన వాదనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘దేశ భద్రతకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని మేం ఎంతమాత్రం కోరుకోవడం లేదు. మీరు పెగాసస్ సాఫ్ట్వేర్ను నిఘాకు ఉపయోగిస్తున్నారా.. లేదా? ఒక వేళ ఉపయోగిస్తే చట్టబద్ధంగానే వినియోగిస్తున్నారా.. మేం తెలుసుకోవాలనుకొంటున్నది కేవలం ఇది మాత్రమే’ అని కేంద్రప్రభుత్వానికి స్పష్టంచేసింది. ‘పెగాసస్తో పౌరులపై నిఘా’ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పెగాసస్పై దాచేది ఏం లేదంటూనే.. దేశ భద్రత కారణాల దృష్ట్యా ఏం చెప్పలేం అంటూ ఆయన చేసిన వాదనల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముసుగులో గుద్దులాటతో సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. తాము భద్రతాపరమైన అంశాల జోలికి వెళ్లడంలేదని పునరుద్ఘాటించింది. ‘సవివరమైన అఫిడవిట్ సమర్పించలేం అని మీరు పదే పదే చెప్తున్నారు. వాదనలు అక్కడక్కడే తిరుగుతున్నాయి. ముసుగులో గుద్దులాటతో సమస్యలకు పరిష్కారం దొరకదు. సాఫ్ట్వేర్తో పౌరుల గోప్యతకు భంగం కలిగిందనేది ఇక్కడ ఆరోపణ. ఇది కేవలం గోప్యత హక్కుకే పరిమితం అయినది. సాఫ్ట్వేర్ వాడుతున్నారా.. లేదా.. అనేది సంబంధిత అధికారులు చెప్పడానికి ఇబ్బంది ఏముంది ’ అని ప్రశ్నించింది. దీనికి తుషార్ మెహతా ‘చెప్పలేం’ అని సమాధానం ఇచ్చారు. దీంతో, ఈ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఆలోపు అఫిడవిట్ సమర్పణపై కేంద్రం పునరాలోచన చేయదల్చుకొంటే కోర్టుకు తెలుపాలని సూచించింది.
బహిరంగంగా చర్చించలేం
సాఫ్ట్వేర్ను వాడుతున్నామా.. లేదా.. అనేది బహిరంగంగా వెల్లడిస్తే తీవ్రవాదులు, ఉగ్రవాదుల్లాంటి దేశ వ్యతిరేక శక్తులు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతకుముందు సుప్రీంకోర్టుకు తెలిపారు. పెగాసస్ వ్యవహారం కోర్టుల్లో, బహిరంగంగా చర్చించదగిన అంశం కాదన్నారు. ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరొకటి అవసరం లేదన్నారు. పెగాసస్ ఆరోపణలు తీవ్రమైనవేనని ఒప్పుకుంటూ, దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సమయం ఇచ్చిందే అఫిడవిట్ కోసం
పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగస్టు 17న తొలిసారి కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఈ నెల 7న విచారణ ప్రారంభించింది. సవివరమైన అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోరగా తుషార్ మెహతా కొంత సమయం కోరారు. దీంతో విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా.. కేంద్రం అఫిడవిట్ సమర్పించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అఫిడవిట్ కోసమే సమయం ఇచ్చాం. ఇప్పుడు మీరేమో అఫిడవిట్ సమర్పించం అంటున్నారు’ అని వ్యాఖ్యానించింది.