Twin Towers | నొయిడాలో 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను కూల్చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానంలో సమీక్షా పిటిషన్ దాఖలు చేయనున్నది రియాల్టీ సంస్థ సూపర్టెక్. సంబంధిత అధీకృత సంస్థ ఆమోదంతోనే, నిబంధనలకు అనుగుణంగానే ఈ టవర్స్ను నిర్మించామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత నెల 31న నోయిడాలో సూపర్టెక్ నిర్మించిన ట్విన్ టవర్స్ను కూల్చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
సూపర్టెక్ చైర్మన్ ఆర్కే అరోరా ఈ సందర్భంగా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే, అధీకృత సంస్థ ఆమోదంతోనే ట్విన్ టవర్స్ నిర్మించామని పేర్కొన్నారు. అపెక్స్, సెయానే టవర్స్కు తమ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులతో సంబంధం లేదన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం తమ సంస్థపై ఉండబోదని ఆర్కే అరోరా స్పష్టం చేశారు. 2014లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అత్యధిక కస్టమర్లకు మనీ రీఫండ్ చేశామని చెప్పారు.
నోయిడాలోని ఎమరాల్డ్ కోర్ట్లో సూపర్టెక్ కంపెనీ ఆ టవర్లను నిర్మించింది. వాటిల్లో వెయ్యి ఫ్లాట్లు ఉన్నాయి. అన్నీ రూల్స్ను అతిక్రమించి ఆ ట్విన్ టవర్లను నిర్మించినట్లు సుప్రీం పేర్కొన్నది. అయితే స్వంత ఖర్చుతో మూడు నెలల్లోగా వాటిని సూపర్టెక్ కంపెనీయే నేలమట్టం చేయాలని సుప్రీం గతవారం తన తీర్పులో ఆదేశించింది.