తెలంగాణ జాతి విముక్తిని సాధించడమే కాదు, రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇరువై వసంతాల నవచైతన్యంతో అలరారుతున్నది. ఇది కేవలం ఉద్యమ పార్టీ కాదు, సాధారణ రాజకీయ పక్షమూ కాదు. ఒక చారిత్రక సందర్భంలో నిర్దిష్ట లక్ష్యంతో జనించిన కేసీఆర్ మానసిక పుత్రిక టీఆర్ఎస్. స్పష్టమైన లక్ష్యమూ, సిద్ధాంతమూ, వ్యూహమూ గల కేసీఆర్ సంధించిన పదునైన అస్త్రమిది. ప్రజాస్వామ్యబద్ధంగానే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవాలని భావించిన ఉద్యమ నేత కేసీఆర్ ఇందుకు సాధనంగా రాజకీయ పక్షం అవసరమని భావించారు. పార్టీ స్థాపన ద్వారా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇక అప్పటి నుంచి కేసీఆర్ భావధారనే ఉద్యమ మార్గమైంది. టీఆర్ఎస్ కార్యాచరణే తెలంగాణ ఉద్యమమైంది.
ప్రజాస్వామ్య ప్రక్రియను తన పంథాగా ఎంచుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. కాళోజీ చెప్పినట్టు ‘కలము, బడితె, రూపాయి’ ఆయుధాలుగా పరాయి శక్తులు అనేక కుట్రలు పన్నాయి. విపత్కర పరిస్థితుల మధ్య రాజకీయ పక్షాన్ని నిలబెట్టుకోవడం కేసీఆర్కు ముళ్ళమీద నడిచినట్టుగానే సాగింది. అయినా ధనబలం గల పార్టీలు జనబలం ఉన్న టీఆర్ఎస్ను ఉపేక్షించలేని పరిస్థితిని ఆయన సృష్టించారు. టీఆర్ఎస్ను నిర్ణయాత్మక శక్తిగా మార్చి కాంగ్రెస్, టీడీపీ చేత ‘జై తెలంగాణ’ అనిపించారు. పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించారు. దేశంలోని రాజకీయ పక్షాలన్నిటినీ ఒప్పించారు. కేసీఆర్ నిరాహార దీక్ష తరువాత వచ్చిన ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. మిగతా రాజకీయ పక్షాలు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైంది. ఇరువై ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో టీఆర్ఎస్ మనుగడ, ఎంతో సహనంతో సాగించిన పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం.
ఇవాళ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను మాత్రమే తమ సొంత పార్టీగా భావిస్తున్నారు. టీఆర్ఎస్ చత్రఛాయల్లోనే తమకు భరోసా ఉంటుందని నమ్ముతున్నారు. ప్రజాభిమానం బాధ్యతను మరింత పెంచుతుంది. ఉద్యమ ఘట్టం ముగిసిన తరువాత టీఆర్ఎస్ ఇక పక్కా రాజకీయ పార్టీ అని కేసీఆర్ స్పష్టంగా చెప్పడం విశేషం. కాలానుగుణంగా మారే ఈ గతిశీలతనే టీఆర్ఎస్ను నిత్యనూతనంగా నిలబెడుతున్నది. తెలంగాణ జాతి సర్వతోముఖాభివృద్ధిలో టీఆర్ఎస్ పాత్ర ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ నూతనోత్తేజంతో సాగుతూనే ఉంటుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ స్వాభిమాన ప్రతీక, అస్తిత్వ పతాక. తెలంగాణ జాతి ఉన్నంత కాలం, గులాబీ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుంది.