హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసింది. పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీచేసిన నోటిఫికేషన్ సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని న్యాయస్థానం ప్రకటించింది. పోలింగ్కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను ఎస్ఈసీ పాటించలేదని, కనుక మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం ఆదేశించింది.
ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే నెల 7న పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. దీంతో పోలింగ్కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎస్ఈసీ పాటించలేదంటూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో పాటు జనసేన, బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై మొదట విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. పోలింగ్కు అనుమమతించిన డివిజన్ బెంచ్.. ఓట్ల లెక్కింపు చేయొద్దని ఆదేశించింది. విచారణను పూర్తిచేసిన న్యాయస్థానం.. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.