న్యూఢిల్లీ: ఇండియాలో అతి పెద్ద టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ బైక్స్ తయారీని తాత్కాలికంగా నిలిపేసింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ పార్ట్స్ సెంటర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాల్లో తయారీని నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 22 నుంచి మే 1 మధ్య నాలుగు రోజుల పాటు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా ప్లాంట్లు మూతపడతాయని తెలిపింది.
ఈ షట్-డౌన్ సమయాన్ని ఆయా కేంద్రాల్లో అవసరమైన నిర్వహణ పనుల కోసం వినియోగించనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఇప్పుడు ఉత్పత్తిని నిలిపేసినా.. డిమాండ్కు తగినట్లుగా ఈ త్రైమాసికం మిగతా నెలల్లో ఉత్పత్తిని పెంచుతామని తెలిపింది. ఇప్పటికే హీరో సంస్థ తమ కార్పొరేట్ ఆఫీస్ల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది.