రంగారెడ్డి/వికారాబాద్, మే 13, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండోరోజు లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. జనం బయటకు రాకపోవడంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల నుంచి ఇంటికే పరిమితమయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు ప్రాంతాల్లో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పాసులు లేకుండా అనవసరంగా బయటతిరిగే వారిని పోలీసులు హెచ్చరించి వాహనాలను సీజ్ చేశారు. అదేవిధంగా ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల సర్వీసులు కొనసాగాయి, జిల్లాలో 500 బస్సులుండగా గురువారం 88 బస్సులు మాత్రమే జిల్లాలోని వివిధ ప్రాంతాలు సర్వీసులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండటంతో ప్రజలు సామగ్రిని కొనుగోలు చేశారు. ఆతర్వాత ఇండ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించారు. తాండూరులో 200 వరకు ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు. బయటకు వచ్చిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కొడంగల్ మండలం రావులపల్లి, తాండూరు మండంలో కొత్లాపూర్ చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లఘించిన వారికి టాస్క్పోర్సు అధికారులు జరిమానాలు విధించారు.