న్యూఢిల్లీ: ప్రజలపై గ్యాస్ బండ భారం నెలనెలా పెరుగుతూనే ఉన్నది. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర మరో రూ.25 పెరిగింది. మంగళవారం సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.25 పెంచిన ఆయిల్ కంపెనీలు, తాజాగా సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా రూ.25 పెంచాయి. ఆయిల్ కంపెనీలు వెల్లడించిన ధరల ప్రకటన ప్రకారం.. ఇప్పుడు ఢిల్లీలో 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.859కి చేరింది. తాజా పెంపుతో వంటగ్యాస్ ధరలను వరుసగా రెండు నెలలు పెంచినట్లయ్యింది. జూలై 1న కూడా సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది.
సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధరను ఆగస్టు 1న కూడా పెంచారు. అయితే అప్పుడు సబ్సిడీ సిలిండర్ ధరల జోలికి వెళ్లలేదు. ఆ సమయంలో పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు జోరుగా కొనసాగాయి. పెగాసస్ స్పైవేర్, ద్రవ్యోల్బణం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాలు మండిపడ్డాయి. అందుకే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుందన్న భయంతో అప్పుడు ప్రభుత్వం సబ్సిడీ వంటగ్యాస్ ధరలను పెంచకుండా ఆయిల్ కంపెనీలను నిలువరించిందని ప్రచారం జరుగుతుంది.
కాగా, వంటగ్యాస్పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే ప్రణాళికలో భాగంగా ప్రతి నెలా క్రమంగా వంటగ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.165 పెరిగింది. ఇక 2014, మార్చి 1 నుంచి అంటే గత ఏడేండ్లలో సిలిండర్ ధర రెట్టిపయ్యింది. అప్పుడు రూ.410 ఉన్న సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు దాదాపు రూ.900కు చేరువైంది.