పనాజీ: కరోనా మహమ్మారితో విద్యా సంస్థలు మూతపడ్డాయి. అంతా ఆన్లైన్లోనే చదువులు కొనసాగుతున్నాయి. అయితే మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను మెరుగుపర్చాలని అర్జీలు పెట్టుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. విసిగి వేసారిన విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటన గోవాలోని వలోపీలో జరిగింది.
సతారీ తాలూకాలోని కొడాల్, సత్రే, డెరోడ్లు మారుమూల గ్రామాలు. ఇంటర్నెట్ వసతి అంతంతే ఉన్నది. మొబైల్లో వీడియో ప్లే చేస్తే చాలా స్లోగా రన్ అవుతుంది. దీంతో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు పక్క గ్రామాలకు వెళ్తున్నారు. దీనికోసం రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఆ గ్రామాల నుంచి రోజూ 16 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు.
తమ ఊర్లకు నెట్ సౌకర్యం మెరుగుపర్చాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్కు లేఖ రాశారు. అయితే ఎలాంటి ఫలితం లేదు.. దీంతో వల్పోయ్లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. తమ గ్రామాలకు నెట్ స్పీడ్ను పెంచాలని డిమాండ్ చేశారు. అధికారులకు రెండు రోజుల గడువు ఇచ్చారు. పరిస్థితి మెరుగు పడకపోతే మళ్లీ పెద్దఎత్తున్న ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదేవిధమైన గతేడాది నెట్వర్క్తో గతేడాది చదువలు కొనసాగించాం. ఇప్పుడైనా పరిస్థితులు మారుతాయని అనుకున్నాం. మళ్లీ ఆన్లైన్ చదువులే అయ్యేసరికి ఇబ్బంది పడుతున్నాం. తమకు నెట్ స్పీడ్ పెంచాలని సోమ్నాథ్ గవాస్ అనే విద్యార్థి అన్నాడు. ఈ సమస్యపై ఇప్పటికే తమ పంచాయతికి ఫిర్యాదు చేశాం. సీఎం ప్రమోద్ సావంత్కు కూడా లేఖరాశాం. సీఎం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఇది ఇలాగే కొనసాగితే తాము ఇతర విద్యార్థుల కంటే వెనకబడిపోతామని మరో విద్యార్థి చెప్పాడు.