కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఏర్పాటు చేయడంతో ఎంత మంది రోడ్డున పడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బతుకు జీవుడా అన్నట్టు పొట్ట చేత పట్టుకొని కాలి నడక సొంతూళ్లకు పయనమయ్యారు. కొందరు తిండి తిప్పలు లేక పస్తులు ఉన్నారు. వారి పరిస్థితులని గమనించిన సోనూసూద్ సొంత ఖర్చుతో చాలా మంది అనాథలకు సాయం చేసి వారి గుండెలలో దేవుడిగా కొలువుతీరాడు.
కరోనా వచ్చినప్పటి నుండి చేతికి ఎముక లేదన్నట్టు సాయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు సోనూసూద్. నాకు సాయం కావాలని సోనూసూద్ దగ్గర మొర పెట్టుకున్న కొద్ది క్షణాలలోనే పని పూర్తవుతుంది. రీసెంట్గా నాగ్పూర్ సమీపంలోని ఓ గ్రామ ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ తన ట్విట్టర్ ద్వారా సోనూసూద్కు చేరవేశాడు. వెంటనే ఆయన ఆ గ్రామంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయించి వారి మనసులని గెలుచుకున్నారు. సోనూ సేవాదృక్పథంపై ప్రశంసల జల్లు కురుస్తుంది.