ఇప్పటి వరకు మండలంలో 81 శాతం వసూళ్లు
ఎనిమిది గ్రామాల్లో నూరుశాతం పూర్తి చేసిన సిబ్బంది
శాయంపేట, మార్చి 29 : మండల పరిధిలో ఇంటి, నల్లా పన్నులు 81 శాతానికిపై వసూలు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది. ఆదిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో మెరుగైన పన్నుల వసూలు కాగా, ఎనిమిది పంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు అయ్యాయి. మండలంలో 24 గ్రామపంచాయతీలుండగా పంచాయతీ అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. అయితే ఈ నెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మరికొన్ని గ్రామాల్లో పన్నుల వసూలు పెరగాల్సి ఉన్నది. మండలంలోని అన్ని పంచాయతీల్లో కలుపుకుని 2019-20 బకాయిలతో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 60.17లక్షలు పన్నుల రూపంలో వసూలు చేయాల్సి ఉన్నది. ఇందులో పాత బకాయిలు రూ.7.65లక్షలు కాగా, రూ.52.52 లక్షలుగా నిర్దేశించారు. ఇంటి పన్ను, నల్లా పన్నుతో పాటు కమర్షియల్ పన్నులను ఇందులో వసూలు చేస్తున్నారు. మండల పరిధిలో పదివేలకుపైగా గృహాలు, అంతేస్థాయిలో నల్లాలు ఉన్నాయి. పంచాయతీ సిబ్బంది, అధికారులు షాపులు, ఇంటింటికీ వెళ్లి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత బకాయిలు రూ.72.99 లక్షలు వసూలు చేశారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలోని రూ.41.58లక్షలను వసూలు చేశారు.
అంటే 81 శాతంగా వసూలయ్యాయి. అయితే ఎమిది పంచాయతీలు మాత్రం వంద శాతం పన్నులను వసూలు చేశాయి. అప్పయ్యపల్లిలో రూ.38,270, ఆరెపల్లిలో రూ.78,81 8, కొత్తగట్టుసింగారంలో రూ.3,05,023, నర్సింహులపల్లిలో రూ.71,665, నూర్జహాన్పల్లిలో రూ.64,398, సాధన్పల్లిలో రూ.1,19,701, సూరంపేటలో రూ. 90,691, సూర్యనాయక్తండాలో రూ.5,92,86లు వసూలు చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రగతిసింగారంలో 81 శాతం, గంగిరేణిగూడెంలో 75 శాతం, గట్లకానిపర్తి 82శాతం, గోవిందాపూర్ 80శాతం, హుస్సేన్పల్లి 76 శాతం, జోగంపల్లి 84 శాతం, కాట్రపల్లి 82 శాతం, కొప్పుల 85 శాతం, మైలారం 69 శాతం, నేరేడుపల్లి 89శాతం, పత్తిపాక 74 శాతం, పెద్దకోడెపాక 74 శాతం, రాజుపల్లి 87శాతం, శాయంపేట 74 శాతం, తహార్పూర్ 91 శాతం, వసంతాపూర్ 84 శాతం వసూలు జరిగాయి. అలాగే పెద్ద పంచాయతీల్లోనూ కొన్ని ఎక్కువగా పన్నులను వసూలు చేశాయి. మొత్తంగా పాత బకాయిలు రూ.35వేలు వసూలు కావాల్సి ఉన్నది. 2020-21 సంవత్సరానికి సంబంధించి రూ.10.93 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయమై మండల పంచాయతీ అధికారి రంజిత్కుమార్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లు పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. ఆడిట్ వల్ల పంచాయతీ సిబ్బంది ఆ పనుల్లోనే బీజీ అయ్యారని తెలిపారు.